Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 2:56 pm Posted by : ramakrishna

శబ్ద కాలుష్యం పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమైన బుల్లెట్ బైక్ సీజ్

 

. . . ఆకతాయిపై బాల్కొండ పోలీసుల కేసు నమోదు

 

బాల్కొండ, బతుకమ్మ :

 

బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ బుల్లెట్ ద్విచక్ర వాహనానికి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్‌ను అమర్చుకొని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమైన వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అధిక శబ్దంతో బుల్లెట్ బైక్‌ను నడుపుతూ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే స్పందించి , సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పబ్లిక్ న్యూసెన్స్, శబ్ద కాలుష్యానికి కారణమైన బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య  మాట్లాడుతూ వాహనాలకు అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేసే లేదా నిబంధనలకు విరుద్ధంగా మార్చిన సైలెన్సర్లను అమర్చుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించడం , భయాందోళనలకు గురిచేయడం , పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడటం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చుకున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతల్లో ఒకటని పోలీస్ కమిషనర్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలను నడపకుండా పోలీస్ శాఖకు సహకరించాలని సీపీ సూచించారు.