. . . కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గండిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బుదవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని శాంతినగర్ కు చెందిన ఫరీద్ బాబా (45) గా నిర్ధారించారు. ఫరీద్ బాబా తాయిత్తులు కట్టడం, చేతబడి గురైన వారిని సఫర్యాలు చేస్తాడని ప్రసిద్ది. అదే మాదిరిగా గుప్త నిధుల తవ్వకాలకు సహకరిస్తాడనేది ప్రచారంలో ఉంది. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఫరీద్ బాబా తిరిగి రాలేదు. నిజామాబాద్ వర్ని రహదారిలోని మల్లారం గండిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా అక్కడ దొరికిన ఆనవాళ్ళను బట్టి అతడిని ఫరీద్ బాబాగా పోలీసులు నిర్ధారించారు. ఫరీద్ బాబాను గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల అమవాస్య సమయంలో అటవీ ప్రాంతానికి రప్పించి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరి పేర్లను ప్రస్తావించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు.
