నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఫార్మూల ఈ – రేస్ కేసులో అరెస్టు తప్పదని భావిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ రోడ్లపైకి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనను అరెస్టు చేస్తే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలని కేటీఆర్ పిలుపునివ్వడం నీచరాజకీయాలకు తెరలేపడమేనని అన్నారు. ఫార్ముల – రేసులో ఎవరికీ లాభం చేకూరిందో ఆ పార్టీ నేతలు, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లర్లను సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు,సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.