. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
. కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల ప్రమాదబీమా అందజేత
వేల్పూర్, బతుకమ్మ: కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని పడగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గొడికె రమేశ్ భార్య రజితకు రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును ప్రశాంత్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వం కలిగిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి అండగా నిలువాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీమా సౌకర్యం కల్పించారన్నారు. రాష్ట్రం లో 60లక్షల పైచిలుకు మంది సభ్యత్వం తీసుకున్నారని, వారందరికీ బీమా వర్తింపజేసేందుకు పార్టీ దాదాపు రూ.11 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం లో సుమారు 50 వేల మంది కార్యకర్తలు సభ్యత్వం కలిగి ఉన్నారని, ఇప్పటి వరకు 45కు పైగా బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు నాగధర్ రెడ్డి, జిల్లా నాయకులు రాములు, పడగల్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, నాయకులు రాజకుమార్, మాజీ ఎంపీటీసీ శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.