ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పోలింగ్ బూతులకు సెక్యూరిటీ తో వెళ్లడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దాంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలో పోలీసుల లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని, ఎమ్మెల్యే సెక్యూరిటీతో పోలింగ్ కేంద్రాలకు వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల తీరు నిష్పక్షపాతంగా లేదని మండిపడ్డారు. ఈ నిరసనతో రాకపోకలు ఆగిపోవడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన చేస్తున్న మాజీ ఎమ్మెల్యేని, నాయకులని బలవంతంగా నాగిరెడ్డి పేట పోలిస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.