. . . అభినందించిన గ్రామస్తులు
జుక్కల్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మారుమూల సరిహద్దు ప్రాంతమైనప్పటికీ ఇక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులు ఎందరో ఉన్నారు. దీనికి నిదర్శనంగా చిన్న గ్రామమైన పడంపల్లికి చెందిన అన్నాచెల్లెళ్లు పట్టుదలతో చదివి ఉన్నత విద్యలో సీట్లు సాధించారు. పావుడే గంగాధర్–సరస్వతి దంపతుల కుమారుడు వెంకటసాయి విష్ణు ఎంబీబీఎస్ సీటు సాధించగా, కుమార్తె ప్రీతిక జేఈఈ మెయిన్స్లో 95 శాతం మార్కులు సాధించి, జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత పొంది ఎన్ఐటీలో ప్రవేశం పొందింది. రైతు కుటుంబంలో జన్మించిన వీరు తల్లిదండ్రుల కష్టాలను కళ్లారా చూస్తూ పేదరికాన్ని జయించాలన్న లక్ష్యంతో, వారి పేరును నిలబెట్టాలన్న దృఢసంకల్పంతో చదువులో రాణించారు. వెంకటసాయి విష్ణు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్లో ప్రవేశం పొందగా, ప్రీతిక జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని ఎన్ఐటీలో సీటు సాధించింది. తల్లిదండ్రుల కష్టాలతో పాటు తాత రాంపటేల్, మేనమామ శ్రీనివాస్ పటేల్ను స్ఫూర్తిగా తీసుకుని తామిద్దరం విజయం సాధించామని వెంకటసాయి విష్ణు తెలిపారు. వైద్యాధికారిగా మారి పేద, బడుగు, బలహీన వర్గాలకు వైద్య సేవలు అందిస్తానన్నారు. ఇంజనీర్గా మారి దేశసేవకు అంకితం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రీతిక తెలిపారు. తమ పిల్లల కోసం పడిన కష్టాలకు ఫలితం దక్కిందని తల్లిదండ్రులు పావుడే గంగాధర్, సరస్వతి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు అన్నాచెల్లెళ్లను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి అభినందించారు.