నందిపేట, బతుకమ్మ :
నందిపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం – 9 లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు, అక్షరాభ్యాస వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్య నిపుణుల సూచనల మేరకు శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ఎంతో అవసరమని, పుట్టిన తర్వాత తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని అంగన్వాడీ సిబ్బంది వివరించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రేఖ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
