. . . ముర్రిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం
మోర్తాడ్, బతుకమ్మ :
పుట్టిన శిశువుకు గంటలోపు తల్లిపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని, ముఖ్యంగా ముర్రిపాలు (కొలస్ట్రం) శిశువుకు అమూల్యమైన పోషకాహారమని అంగన్వాడీ టీచర్ సుజాత పేర్కొన్నారు. ముర్రిపాల వల్ల చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని ఆమె వివరించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం మోర్తాడ్ మండలంలోని డోల్పాల్ గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుకు తొలి గంటలోనే తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం, ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే అందించాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, ఐకేపీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.