Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 8:29 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్ రాజా గౌడ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజా గౌడ్ మాట్లాడుతూ, బ్రహ్మణపల్లి గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ విశేష కృషి చేశారని తెలిపారు. గ్రామానికి రూ.15 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేయడం, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.15 లక్షల నిధులు కేటాయించడం, మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయడం, అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టడం, అలాగే అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ ప్రజలకు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, గృహ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.