. . . స్నేహ సొసైటీ కార్యదర్శి, ప్రిన్సిపాల్ ఎస్. సిద్దయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆషాఢ మాసంలో బోనాల పండుగ నిర్వహించడం తెలంగాణ సంప్రదాయంలో భాగమని స్నేహ సొసైటీ కార్యదర్శి, ప్రిన్సిపాల్ ఎస్. సిద్దయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని తారకరామనగర్లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలోని అంధుల ప్రత్యేక పాఠశాలలో శుక్రవారం బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, భక్తుల కోలాహలంతో బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. స్నేహ సొసైటీ భవనం నుంచి సమీపంలోని పోలేరమ్మ ఆలయం వరకు భక్తులు బోనాలు మోసుకుంటూ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ జరీనా ఆధ్వర్యంలో ట్రాన్స్ మహిళలు సంప్రదాయ వేషధారణలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు విశేషంగా హాజరయ్యారు. స్నేహ సొసైటీ కార్యదర్శి, ప్రిన్సిపాల్ ఎస్. సిద్దయ్య మాట్లాడుతూ స్నేహ సొసైటీలో 2014 నుంచి ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, కార్యవర్గ సభ్యులు వీరేశం, టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ మేనేజర్ శివ, ఎం అండ్ ఇ విజయ్, జీఎన్ఎం మౌనిక, శివసత్తులు వంశీప్రియ, సూచి, లాస్య, పోతరాజు నరహరి, ట్రాన్స్ మహిళలు జరీనా, శ్యామలతో పాటు స్నేహ సొసైటీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
