నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని 3వ డివిజన్ గూపన్ పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించిన బోనాలను తలపై ఎత్తుకుని ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా శివసత్తులు పూనకంతో భక్తులను ఆకట్టుకోగా, డప్పు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, సంప్రదాయ కళారూపాలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ వీధులన్నీ భక్తి గీతాలతో మార్మోగిపోగా, యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో గ్రామానికి సుఖశాంతులు, పంటలు సమృద్ధిగా కలగాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మూడో డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
