నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడికి నిరసనగా బీజెపీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తా లో సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ లు మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు కలిసి ఎమ్మెల్యే పై దౌర్జన్యంగా దాడి చేసేందుకు కుట్ర పన్నారని, కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు నిజమైతే వాటికి సంబందించిన రుజువులను అధికారుల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కేవీఆర్ తగిన రుజువులను కలెక్టర్ ముందు పెట్టెందుకు సిద్దమయ్యారని, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు కూడా ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని సహించలేని కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు స్రవంతిరెడ్డి, మల్లేష్ యాదవ్ తదితరులున్నారు.