- ఇందూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నేటి బీసీ బంద్కు బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఇందూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ బీసీల పక్షానే ఉంటుందని తెలిపారు. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ లేకుండా, బీసీలకు న్యాయం చేయాలనే విధానం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 28 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా, అనేక రాష్ట్రాల్లో బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులను బీజేపీ పార్టీనే చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీజేపీపై బురద చల్లే రాజకీయాలు చేస్తోందని, మతపరమైన రాజకీయాలు మానుకుని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. బీసీ బంద్ను విజయవంతం చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.