నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి శుక్రవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి, గంజాయి అక్రమ రవాణా, బీజేపీ కార్యకర్తలపై దాడులు, అలాగే క్రికెట్ బెట్టింగులు, బెట్టింగ్ యాప్ల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిల్లాలో కొన్ని అనేక అవాంఛిత ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ప్రజల్లో భద్రతా విశ్వాసం పెంచేందుకు పోలీసులు మరింత కృషి చేయాలని కోరారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా & విక్రయం పెరుగుతుండటంతో యువత భవిష్యత్తు అంధకారంలో పడుతోందన్నారు. దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల బీజేపీ కార్యకర్తలపై రాజకీయ ప్రేరిత దాడులు పెరుగుతున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, కార్యకర్తలకు భద్రత కల్పించాలని కోరారు.అక్రమంగా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగులు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు యువతను అనాశనంలోకి నెడుతున్నాయని, ఈ యాప్లను ఉపయోగించి అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని సమాచారం అందిందని తెలిపారు. పోలీస్ విభాగం వీటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అన్ని విషయాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటారని అని హామీ ఇచ్చారు.