Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 May 2025, 4:52 pm Posted by : ramakrishna

బీజేపీ మారణకాండ కొనసాగిస్తోంది

మంచిర్యాల, బతుకమ్మ: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మారణకాండను సాగిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను మంచిర్యాలలో ఎమ్మెల్సీ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యరద్శి నంబాల కేశవ రావు ఎన్ కౌంటర్ లో మరణిస్తే కనీసం మానవత్వం చూపలేదని, అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడా బీజేపీకి లేదన్నారు. ఆపరేషన్ కగార్ ను ఆపాలని పదే పదే కోరుతున్నా మారణకాండను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి నది పుష్కరాలకు ఆహ్వానించకుండా కాంగ్రెస్ దళిత వ్యతిరేక వైఖరికి బయటపెట్టుకుందని పెద్దపల్లి ఎంపీ వంశీ అన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో కూడా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అవమానించారని, కుటుంబ సభ్యలతో సహా సీఎం పైన ఆసనాలపై కూర్చొని, భట్టిని మాత్రం కింది ఆసనాల్లో కూర్చోబెట్టిన దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డిదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ వైఖరి సమసమాజ నిర్మాణానికి, ప్రగతిశీల దృక్పథానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.