. తెలంగాణ చాలా కుట్రలు చూసింది
. బీసీ బిడ్డలను మోసం చేయొద్దని హెచ్చరిస్తున్నా..
. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ చాలా కుట్రలు చూసిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలు ఇక్కడ సాగవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎర్రవల్లిలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కులగణన సర్వేలో బీసీలకు సంబంధించి తప్పుడు లెక్కలపై చర్చను పక్కదారి పట్టించేందుకు మోదీ బీసీనా.. కాదా.. అనే చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని, మరో వైపు రాహుల్ గాంధీది ఏ మతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారన్నారు. బీసీ అంశంపై నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం అనేది తమకు సంబంధం లేదని, బీసీల గణన సరిగా చేపట్టాలనేదే తమది డిమాండ్ అని స్పష్టం చేశారు. బీసీ బిడ్డలను మోసం చేయొద్దని కాంగ్రెస్, బీజేపీలను హెచ్చరిస్తున్నానని అన్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ను తలవని గుండె తెలంగాణ లో లేదన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ పూజలు చేస్తున్నారన్నారు.