. . . నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బిజెపి, కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయలేరని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట లో 20,21 డివిజన్ లో శుక్రవారం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి పార్టీ అధికారంలో లేదని చెప్పిన అర్బన్ ఎమ్మెల్యే, ఇప్పుడు మేయర్ ని గెలిపించాలని చెప్తున్నాడని, మేయర్ గెలిస్తే అధికారం వస్తదా అని ప్రశ్నించారు. రెండున్నర సంవత్సర కాలంలో ఇప్పటివరకు నగరంలో చేసింది ఏమీ లేదని, రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. నా మీద, కేసీఆర్ మీద కోపం కొద్దీ నన్ను ఓడించలేదని, రేవంత్ రెడ్డి జూట మాటలు నమ్మి మోసపోయి వారికి ఓటేశారని పేర్కొన్నారు. కళ్యాణ్ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పాడని, సిలిండర్ ఫ్రీ ఇస్తానని చెప్పాడని, ఇలాంటి మాటలకు నమ్మి మోసపోయారని అన్నారు. ఎల్లమ్మ గుట్టలో ఇంత మంచిగా రోడ్లు వేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు.
నిజామాబాద్ నగరంలో బిజెపి ఎమ్మెల్యే ఫెయిల్
మా ప్రభుత్వంలో ప్రజల భద్రతలను కాపాడుకున్నామని, ఏ జాతర వచ్చిన, గణేష్ నిమజ్జనం వచ్చిన కుల మతాలను కూర్చోబెట్టి మాట్లాడినమని, నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు గల్లీ గల్లీలో దుకాణాలు ఉన్నాయన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ది దారులకు వధూవరులకు బట్టలు సొంతంగా నా డబ్బుతో నేను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ రూ. 200 పెన్షన్ 2000 చేస్తే .. రేవంత్ రెడ్డి రూ. 4000 ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడని, రూ. 2000 పెన్షన్ ఇస్తే కెసిఆర్ కి ఓటు వేయండి, రూ. 4000 పెన్షన్ ఇస్తే రేవంత్ రెడ్డికి ఓటు వేయండి అని అన్నారు. కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి ఓట్లు దండుకోవాలని చూసే నీచ రాజకీయం ఆ పార్టీలదని, దయచేసి మా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ అభ్యర్థి, పెంచాలా శ్రీలత శ్రీనివాస్ 21 వ డివిజన్ అభ్యర్థి డాక్టర్ దండు రుషిత,మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,మేస్త్రి సంఘం అధ్యక్షుడు వేణు, మహేష్ మరియు బీఆర్ఎస్ నాయకులు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
