Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 5:13 pm Posted by : ramakrishna

కాంగ్రెస్‌లో చేరిన భూంపల్లి సర్పంచ్, వార్డు సభ్యుడు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్, వార్డు సభ్యుడు బండ శ్రీను ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, ప్రస్తుతం ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం తమను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రేరేపించిందని తెలిపారు. భూంపల్లి గ్రామానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంఘ భవనం నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వారు వివరించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సర్పంచ్ గైని శ్రీనివాస్, వార్డు సభ్యుడు బండ శ్రీను వెల్లడించారు.