Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 8:39 pm Posted by : ramakrishna

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన వర్ని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఒకింత జాప్యం జరుగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా దరఖాస్తులు పెండింగ్ లో ఉండడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని అన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

Bhubharati's pending applications should be resolved promptly