Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 2:38 pm Posted by : ramakrishna

భజనలు ముక్తికి మార్గాలు

  • భజనలు భక్తి తన్మయత్వాన్ని కలిగిస్తాయి
  • ఆధ్యాత్మిక వక్త శ్రీ రాఘవేంద్ర మహారాజ్

 

వేల్పూర్, బతుకమ్మ : సాంస్కృతిక కార్యక్రమం ల్లో,భక్తి రసంలో భజనలకు ప్రత్యేక స్థానం ఉందని, భక్తితో చేసే భజనలు భక్తులకు ముక్తిని కలిగిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక వక్త, ధర్మ ప్రచారకులు శ్రీ రాఘవేంద్ర స్వామిజీ అన్నారు. శుక్రవారం మండల కేంద్ర  శివారులో గల శ్రీ గోవింద సాయి దివ్య యోగాశ్రమంలోనిర్వహిస్తున్న అఖండ గురునామ సప్త భజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని ఆచరిస్తూనే తరచూ భజనలు చేయాలని, తద్వారా మనుషులకు తన్మాయాత్వం కలిగి తేజవంతులు అవుతారన్నారు. అంతే కాకుండా మనసు తేలిక పడుతుందని,భజనలు కేవలం పాటలు మాత్రమే కాదని,అవి భక్తిని వ్యక్తపరిచే అత్యుత్తమ మార్గాలన్నారు.మనసు ప్రశాంతంగా ఉంచే భజనలు ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని దైవంతో అనుసంధానం చేస్తాయని, భారతీయ సంస్కృతిలో భజనలకు విశిష్ట స్థానం ఉంటుందన్నారు. మీరాబాయి, కబీర్, తులసీదాస్, పురంధర దాసు వంటి మహానుభావులు భజనల ద్వారా భక్తిని ప్రచారం చేశారని, తద్వారా వారు ముక్తిని పొందరిని వివరించారు. శ్రీకృష్ణ, రామ, శివ, భజనలు కోట్లాదిమంది భక్తుల మనసులను హత్తుకున్నానే ఉంటాయని, కాలంతోపాటు భజనల రూపం మారినప్పటికీ, వాటి భక్తి పూరిత ప్రభావం మాత్రం మారలేదన్నారు. ప్రాచీన కాలం నుంచే భజనలు భక్తి మార్గంలో ఒక భాగంగా ఉన్నాయని, వేద కాలం నాటి శ్లోకాలు, స్తోత్రాలు కూడా ఒక రకమైన భజనలేనన్నారు. భజనలు భక్తిలో తడిసి మునిగే ఆనంద అనుభూతిని కలిగిస్తాయని,దైవాన్ని సమీపించే మార్గంగా కూడా భావిస్తారన్నారు.భజనల్లోని పదాలను పునరావృతం చేయడం వల్ల మనస్సు శాంతించి, ధ్యానస్థితికి చేరుతుందని, భక్తి రసాన్ని వ్యక్తపరిచే ఈ భజనలు మనస్సును స్వచ్ఛంగా మార్చే శక్తిని కలిగి ఉంటాయన్నారు. భజనలు మనలోని ప్రతికూల భావాలను తొలగించి, సానుకూలతను నింపుతాయని,భజనల్లో రాగం, తాళం, పదాలు కీలకపాత్రను పోషిస్తాయని శ్రీ గోవింద గిరి స్వామి వారి శిష్యరత్నం శ్రీ రాఘవేంద్ర మహారాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందగిరి స్వామి శిష్య బృందం, సాయి సేవకులు, భజన కళాకారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.