- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి, జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. భగత్ సింగ్ కి భారత రత్న ప్రకటించి, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ చట్టం అమలు చేయాలని అన్నారు. ఆదివారం ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్బంగా సాయి రెడ్డి పెట్రోల్ బంక్ దగ్గర భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ భగత్ భగత్ సింగ్ పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28 న కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించాడని తెలిపారు. 3 సంవత్సరాల వయసులో తుపాకీ మొక్కలు నాటిన విప్లవ బాలుడు, 20 సంవత్సరాల కాలంలోనే బ్రిటిష్ వారిని గడ గడ లాడించి, 23 సంవత్సరాల వయసులోనే భారత మాత దాస్య శృంఖలాల నుండి విడిపించడం కోసం ప్రాణ త్యాగం చేసి, ప్రతి భారతీయుడిలో విప్లవాగ్నిని రగిలించిన యోధుడు. భగత్ సింగ్ అంటేనే ఒక మండే అగ్నిగోళం, జ్వలించే నిప్పుకణిక దేశ స్వాతంత్య్రం కోసం తన స్నేహితులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించి,దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడారు. మర్చి 23, 1931 రాత్రి 7:30 గంటలకు అసువులు బాశారు. నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురిని నిల్చోబెట్టి ఉరి తీసింది. ఉరికొయ్య ముందు ఆ ముగ్గురు నిల్చుని ఏ మాత్రం భయపడలేదు. ఆ ధైర్యమే ప్రవాహంలా మారి నేటి తరాలకు చేరింది. వారి స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థి, యువత పోరాడాలని, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రంజిత్,నాయకులు నవీన్ కృష్ణ,సుభొద్,ప్రదీప్,రమేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
