వైద్యులు సమయపాలన పాటించాలి
పోతంగల్ పీ.హెచ్.సీ తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యసిబ్బందిని ఆదేశించారు. వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. బుధవారం పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. అంతకుముందు కోటగిరిలో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా, సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా అని ప్రిన్సిపల్ డాక్టర్ మొహమ్మద్ ముబీన్ ను అడిగి తెలుసుకున్నారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూంలను పరిశీలించారు. కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వంటలో వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
