బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా రెండవసారి గోపాల్ పేట్ గ్రామానికి చెందిన బెస్త శాంత ఎన్నికైనట్లు ఎల్లారెడ్డి ఐకెపి ఎపిఎం ప్రసన్న రాణి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో మండల సమాఖ్య సాధారణ సమావేశం నిర్వహించి, మండల సమైక్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా ఎల్లారెడ్డి ఏపిఎం ప్రసన్నరాణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1995 మ్యాక్స్ చట్ట ప్రకారం మండల మహిళా సమాఖ్య విధుల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. మండలంలో ఉన్న 32 గ్రామ సంఘాల నుండి దగ్గర్లో ఉన్న రెండు, మూడు గ్రామ సంఘాలను కలిపి ఒక నియోజకవర్గంగా మొత్తం తొమ్మిది నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గం నుండి ఒకరు కార్య నిర్వాహక సభ్యురాలుగా ఎన్నికల నిర్వహించడం జరిగిందన్నారు. కార్యనిర్వాక కమిటీ 9 మంది సభ్యుల నుంచి ముగ్గురు పాలకవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. మండల సమాఖ్య అధ్యక్షురాలుగా బెస్త శాంత, కార్యదర్శిగా నాయికోటి మంజుల, కోశాధికారిగా బోయిని మమతలను ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీఎం జగదీష్ కుమార్, సీసీలు రమేష్, దత్తు, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రషీద్, ఆయా గ్రామాల సంఘ సభ్యులు పాల్గొన్నారు.