నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
2026-2027 విద్యా సంవత్సరానికి గాను గిరిజన విద్యార్థుల కోసం అమలు చేస్తున్న బెస్ట్ అవైలేబుల్ స్కూల్ స్కీమ్ కింద 3వ, 5వ, 8వ తరగతుల ఇంగ్లిష్ మీడియం ప్రవేశాల ఎంపిక ప్రక్రియను నిజామాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ మంగళవారం నిర్వహించింది. జిల్లా సమీకృత కార్యాలయంలోని మీటింగ్ హాల్లో మధ్యాహ్నం 12 గంటలకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా విద్యాశాఖాధికారి, గిరిజన అభివృద్ధి అధికారి, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ విధానంలో ఎంపిక చేపట్టారు. ఈ ప్రక్రియలో మొత్తం 35 జనరల్ సీట్లకు 35 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 3వ తరగతికి 17 మంది, 5వ తరగతికి 9 మంది, 8వ తరగతికి 9 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అదే విధంగా ప్రత్యేకంగా కేటాయించిన పివిటిజి సీట్లలో 4 స్థానాలకు గాను ఒక్క విద్యార్థి మాత్రమే ఎంపికైనట్లు వెల్లడించారు. మిగిలిన 3 సీట్లకు దరఖాస్తులు అందకపోవడంతో, ఆ సీట్ల భర్తీ కోసం తిరిగి ప్రత్యేక పత్రికా ప్రకటన ద్వారా పివిటిజి వర్గాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు గిరిజన అభివృద్ధి అధికారి డి. సౌజన్య తెలిపారు.
