నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాజకీయ పార్టీలు రాష్ర్టంలో 56శాతం ఉన్న బీసీలను మోసపూరిత హామీలతో మాయ చేస్తున్నాయని, బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ బహిరంగ విచారణలో పలు అంశాలను ఆయన కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ బీసీలను నమ్మించి గొంతు కోసిందని, 25శాతంగా ఉన్న రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో 21శాతం మాత్రమే అమలు చేసి తీరని అన్యాయం చేసిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపట్టడంతోపాటు బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మూడు నెలల్లో బీసీ కుల గణన చేపట్టి రిజర్వేషన్లను నిర్ధారించిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన హై కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. వెంటనే బీసీ రిజర్వేషన్లను నిర్ధారణ చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు.