Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 8:37 pm Posted by : ramakrishna

కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు

 

. . . ప్రజల భద్రతే లక్ష్యమని మున్సిపల్ అధికారులు

 

. . . అలుగు ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచన

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కి చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా అలుగు ప్రాంతంలో మున్సిపల్ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. చెరువును తిలకించేందుకు వచ్చే ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు అలుగు ప్రాంతానికి వెళ్లకుండా ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్ మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిందని, ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలుగు ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొని బారికేడ్ల ఏర్పాటును పరిశీలించి, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం ముగిసే వరకు చెరువుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ విజ్ఞప్తి చేశారు.