Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 5:49 pm Posted by : ramakrishna

బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి

 

. . . భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి

 

. . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చి ఆయన మీద ఫోక్సో కేసు నమోదైనప్పటికీ , ప్రభుత్వం ఇంతవరకు అరెస్టు చేయకపోవడం ఈ కేసు నీరుగారచటానికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒత్తిడి పనిచేస్తున్నట్లుగా ప్రజలు భావించాల్సి వస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ  సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసినప్పటికీ సిట్ ఆధికారిని కేసులో నిజ నిజాలు బయటపడిన తర్వాత ఆరోపణలు రుజువైతే భగీరథ్ ను అరెస్టు చేస్తామని పేర్కొనటం సరైనది కాదని, ఇప్పటికే బాధితురాలి పైన వారి కుటుంబ సభ్యుల పైన కేంద్ర మంత్రి ఒత్తిడి పనిచేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం అధికార బలం ఉన్న వారికి ఒక న్యాయం, బలహీనులకు ఒక న్యాయం అనే విధంగా వ్యవహరించకుండా అందరికీ ఒకే రకమైన న్యాయం జరిగేటట్లు చర్యలు చేపట్టాలని, అందుకొరకు బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని, ఈ చర్యకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల బిజెపి ప్రభుత్వం బేటి బచావో, బేటి పడావో అనే నినాదానికి వారు చెప్పే మాటలకు పొంతన ఉండదని, బిజెపి మహిళలకు వ్యతిరేకిగా ప్రజలు భావించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు మాట్లాడుతూ బిజెపి మనువాద సిద్ధాంతానికి అనుగుణంగా మహిళలను ఒక సరుకుగా భావిస్తారని, అర్థం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు .ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్త చక్రధర్ పాల్గొన్నారు.