Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 7:25 pm Posted by : ramakrishna

బాల్కొండ ఎంఈఓ రాజేశ్వర్ సస్పెన్షన్

 

బాల్కొండ, బతుకమ్మ :

 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో బాల్కొండ మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) బట్టు రాజేశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎస్సీఈఆర్టీ శిక్షణ తరగతుల్లో భాగంగా బాల్కొండలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో సాంఘిక శాస్త్రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన నోటు పుస్తకాలను ఉపాధ్యాయులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పేద విద్యార్థులకు అందాల్సిన నోటు పుస్తకాలను శిక్షణ అవసరాలకు వినియోగించడం ప్రభుత్వ ఉచిత విద్యా సామాగ్రి పంపిణీ లక్ష్యానికి విరుద్ధమని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే నాణ్యత లేని సామాగ్రి సరఫరా, శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు కూడా వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి స్పందిస్తూ, బాల్కొండ కోర్స్ డైరెక్టర్‌పై తక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంచాల కులు మదన్ మోహన్ ఈ నెల 25న బాల్కొండ ఎంఈఓ బట్టు రాజేశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Balkonda MEO Rajeshwar Suspended