. . . పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ
హైదరాబాద్, బతుకమ్మ :
బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది మంది భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై అమ్మవారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ మహోత్సవం సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులు, మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి, శాసనసభ్యులు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

వారికి దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు వంటి అన్ని సౌకర్యాలను కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సాఫీగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ చైర్మన్ సాయిబాబా ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, విద్యుత్, వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో సేవలు అందించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, డీసీపీ ట్రాఫిక్ కాజల్ సింగ్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
