Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 5:19 pm Posted by : ramakrishna

పాలిటెక్నిక్ కళాశాలల గురించి అవగాహన కల్పించాలి

 

. . .  ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులు తగిన విధంగా ప్రవేశాలు పొందడం లేదని, ఈ కళాశాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థిని, విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ఆయన నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు, బోధన, బోధనేతర సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. యువతకు తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలనే తపనతో ఉద్దేశ్యంతో జిల్లాలో విరివిగా పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా, ప్రజలకు వారి అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను సన్నద్ధం చేశామని అన్నారు.

 

Awareness should be created about polytechnic colleges.

 

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా లబ్దిదారులకు అవసరమైన తోడ్పాటును అందిస్తున్నామని, ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు కలిపి ఆయిల్ పామ్ ఫాక్టరీని ప్రభుత్వం కేటాయించినందున, అనువైన స్థలం కోసం పరిశీలన జరుపుతున్నామని, ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం సాధ్యమైనంత త్వరగా ఫాక్టరీని ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, సందీప్ తదితరులు ఉన్నారు.

 

Awareness should be created about polytechnic colleges.