నందిపేట్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నందిపేట్ ఎస్ఐ కె. వినయ్ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లారం గ్రామంలో యువకులకు మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యువతకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు మానవ శరీరానికి, మెదడుకు తీవ్రమైన హాని కలిగించే రసాయనాలని పేర్కొన్నారు. వీటి వినియోగం వల్ల గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. అదే విధంగా శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని వివరించారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లారం ఉపసర్పంచ్ మైముద్, పోలీసు సిబ్బంది, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.