ఎల్లారెడ్డి, బతుకమ్మ : జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా గురువారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డా.నిజాం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జి.రమణ హాజరై మాట్లాడారు. భారత దేశంలో 20 సంవత్సరాల వ్యవధిలో సాధారణ ఆత్మహత్యలు రెండు శాతం ఉంటే విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయని తెలిపారు. గత పది సంవత్సరాలలో 6654 నుండి 13004 పెరిగాయని జాతీయ నేర గణాంకాల సంస్థ, బాలికలు బాలురు సమాన స్థాయిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. మనిషి తన లక్ష్యం చేరుకోలేక పోయినప్పుడు నిస్సహాయుడిగా ఉన్నప్పుడు తనకు భవిష్యత్తు అంధకారంగా కనిపించినప్పుడు విపరీత మానసిక ఒత్తిడికి గురై తన గోడు వినేవారు ఎవరూ లేరన్న బాధలో ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనల వైపు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. జెండర్ ఎఫెక్ట్, మొబైల్ వాడకం, మత్తు పదార్థాలకు బానిసవ్వటం,ఆర్థిక సమస్యల వల్ల విద్యార్థుల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారని, ఎవరైతే ముభావంగా ఉంటారో ఒంటరితనం, సమయానికి తినకపోవడం, నిద్రపోకపోవడం, అదే తీరుగా ఆత్మహత్యల గురించి సంభాషించటం, సోషల్ మీడియాలో అన్వేషించడం గుర్తించదగ్గ అంశాలని తెలిపారు. అలాగే చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఒత్తిడికి గురవడం, పరీక్షల్లో ఫెయిలయ్యామని, ఉద్యోగాలు రాలేదని, ప్రేమలో విఫలమయ్యామని, జీవితంలో ఇంకేది సాధించలేమని,మత్తు పదార్థాలకు బానిసై దొరకని సమయంలో ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఆత్మహత్యలకు పూనుకుంటున్నారన్నారు. ఈ తరహా ఆలోచనలు తగ్గాలంటే ప్రతి వ్యక్తి వ్యాయామము, యోగా, ధ్యానం చేయాలని తెలిపారు. ముఖ్యంగా ధైర్యం కలిగిన యువతే దేశానికి బలం కాబట్టి తనలోని శక్తిని తెలుసుకోవాలి, ధైర్యంగా ముందుకు సాగాలి, తన లక్ష్యాన్ని చేరడానికి ఎన్ని అడ్డంకులు వచ్చిన వాటిని జయించగలగే సామర్థ్యం తనలో ఉండాలని స్వామి వివేకానంద చెప్పిన అంశాలను మననం చేసుకోవాలని సూచించారు. జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమ సామాజిక కార్యకర్త డా. రాహుల్ మాట్లాడుతూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అలాగే ఏ ఒక్క విద్యార్థికైనా మానసిక సమస్యల పట్ల కౌన్సిలింగ్ లేదా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది డా.రాహుల్,డా సచిన్,రాణి,సరిత అధ్యాపకులు సతీష్,గౌతమి,వైశాలి,రాధ,సాయగౌడ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
