
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ జ్యోతి వెలిగించి క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈషా ఫౌండేషన్ సంస్థ జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు క్రీడా పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. ఈషా ఫౌండేషన్ మెంబర్ వసంత గీత మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. మొదటి రోజు నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో 30 టీములు పాల్గొనగా ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.9వేలు, రెండో బహుమతిగా రూ.6వేలు, మూడో బహుమతిగా రూ.3వేలు, నాలుగో బహుమతిగా రూ.2వేలు అందజేయనున్నారు. అలాగే రెండో రోజైన ఆదివారం మహిళలకు త్రో బాల్ క్రీడలు నిర్వహించనున్నారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.5వేలు, రెండో బహుమతిగా రూ.3వేలు, మూడో బహుమతిగా రూ.2వేలు, నాలుగో బహుమతిగా రూ.2వేలు, నాలుగో బహుమతిగా రూ.1500 ఇవ్వనున్నారు.
