బోధన్, బతుకమ్మ : విధి నిర్వహణలో ఉన్న అసిస్టెంట్ లైన్ మెన్ ఒకరు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటన బోధన్ మండలంలోని రాజీవ్ నగర్ తండాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎడపల్లి గ్రామానికి చెందిన మహేందర్ బోధన్ మండలంలో అసిస్టెంట్ లైన్ మెన్ గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం విధుల్లో భాగంగా రాజీవ్ నగర్ తండాలో విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఎల్ సీ తీసుకోకుండా మహేందర్ పోల్ ఎక్కడంతో 11 కేవీ లైన్ విద్యుత్ తీగ తగిలి కిందపడి పోయాడు. స్థానికులు వెంటనే బోధన్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనతో మహేందర్ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాధిత కుటుంబాన్ని డీఈ ముఖ్తార్ పరామర్శించారు. ఎల్ సీ తీసుకోకుండా పోల్ ఎక్కడం కారణంగానే మహేందర్ మృతి చెందాడని అన్నారు.
