Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 4:46 pm Posted by : ramakrishna

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

 

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

 

. . . డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన కలెక్టర్, అదనపు కలెక్టర్,  అబ్జర్వర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రి తో సిబ్బంది తరలింపు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలలో వసతులు, పోలీసు బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నిఘా బృందాల పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలపై ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేశామని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11న జరుగనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి వేర్వేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు, బోధన్ మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయిన విజయ మేరీ హైస్కూల్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీ.ఓ, ఏ.పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు.  ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేయాలని ఎన్నికల సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఎక్కడ కూడా రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా పక్కాగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఓటింగ్ సందర్భంగా గోప్యతను కాపాడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిపిస్తున్నందున, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. పోలింగ్ బూత్ లలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, వీల్ చైర్ వంటి వసతులతో పాటు, ప్రతి పోలింగ్ స్టేషన్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రతి పీ.ఎస్ లో ఓటర్లకు సహకరించేలా బీ.ఎల్.ఓలతో కూడిన హెల్ప్ డెస్క్ లు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ లో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యేలా నిఘా బృందాలు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నాయని తెలిపారు. ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గడువు లోపు పోలింగ్ కేంద్రం లోనికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5.00 గంటలు దాటిన తరువాత కూడా టోకెన్లు జారీ చేసి, ఓటు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని అన్నారు. ఇదిలా ఉండగా, అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి భీంగల్, ఆర్మూర్ పట్టణాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించి, చెక్ లిస్టు ప్రకారం సామాగ్రి అందిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. అనంతరం అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకొని ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరును నిశిత పర్యవేక్షణ జరిపారు. వీరి వెంట సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, అధికారులు ఉన్నారు.

 

 

Arrangements for conducting municipal election polling are complete.
Arrangements for conducting municipal election polling are complete.