. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
పోచారం ప్రాజెక్టు పూడిక తీతతో పాటు నియోజకవర్గంలోని చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులకు పరిపాలనా ఆమోదం మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం, సాగునీటి వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వివరాల ప్రకారం, ప్రారంభంలో 2.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన పోచారం ప్రాజెక్టు, సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక కారణంగా ప్రస్తుతం 1.5 టీఎంసీలకు పరిమితమైంది. దీంతో నాగిరెడ్డిపేట మండలంతో పాటు కింది ఆయకట్టు రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. పోచారం ప్రాజెక్టును నేషనల్ ఫ్రేం వర్క్ ఆఫ్ సెడిమెంట్ మేనేజ్ మెంట్ లో చేర్చి కేంద్ర నిధులతో పూడిక తీత పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కడెం, లోయర్ మానేరు, మిడ్ మానేరు ప్రాజెక్టులు ఈ ఫ్రేమ్ వర్క్ లో చోటు దక్కించుకున్న నేపథ్యంలో పోచారం ప్రాజెక్టును కూడా చేర్చాలని కోరారు. అదే విధంగా గత ఏడాది భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 17 చెరువులు, కుంటలు దెబ్బతిన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వీటి పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం రూ.23.60 కోట్ల ఎఫ్డిఆర్ అంచనాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ, రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పరిపాలనా ఆమోదం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే సాగునీటి వనరులు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. పోచారం ప్రాజెక్టులో పూడిక తీతతో పాటు నియోజకవర్గంలోని చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు పూర్తయితే రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వినతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రతిపాదనలను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించాలని నీటిపారుదల శాఖ ఈఎన్ సి అధికారులను ఆదేశించిన మంత్రి, అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేసి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడైంది.
