- కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, బతుకమ్మ : లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మీ సేవ కేంద్రాలలో ఈ నెల 17వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా భూమి సర్వే అంటే భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే ప్రతి దరఖాస్తుదారుడు సీఎస్ఎస్ఎల్ఆర్ ద్వారా తెలియజేయబడిన తేదీ నుండి సర్వే/సబ్ డివిజన్ మ్యాప్ను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు. అయితే సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో అర్హత కలిగిన సర్వేయర్లు సరిపడా సంఖ్యలో లేనందున, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది లైసెన్స్ సర్వేయర్లను అర్హత ప్రాతిపదికన ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. లైసెన్సు సర్వేయర్ గా ఎంపికైన వారు నెలకు సుమారు 30 వేల రూపాయలకు పైగా ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. లైసెన్స్ సర్వేయర్ గా ఎంపికైన వారికి జిల్లా కేంద్రంలో ఈ నెల 26 నుండి జూలై 26 వరకు రెండు నెలల పాటు (50 పని దినాలలో) శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. శిక్షణ ముగింపులో పరీక్ష ఉంటుందని, ఈ పరీక్షలో థియరీ, ప్లాటింగ్ అండ్ ప్రాక్టికల్ అనే మూడు భాగాలు ఉంటాయన్నారు. పరీక్షలోని ప్రతి విభాగంలో 60 శాతం ఉత్తీర్ణత సాధించాలని, మొత్తం 3 పేపర్లలో ఉత్తీర్ణత సగటున 70 శాతానికి తక్కువ కాకుండా ఉండాలని తెలిపారు. శిక్షణ పొంది పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారు, ప్రభుత్వ సర్వేయర్ కింద 40 పని దినాల పాటు శిక్షణ కార్యక్రమంలో భాగంగా అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. అప్రెంటిస్షిప్ శిక్షణ పూర్తయిన తర్వాత, లైసెన్స్ పొందడానికి డిపార్ట్మెంట్ నిర్వహించే అసెస్మెంట్ టెస్ట్లో అభ్యర్థులు ఉత్తీర్ణులు కావాలన్నారు. అసెస్మెంట్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థికి లైసెన్స్ ఇవ్వబడుతుందని కలెక్టర్ తెలిపారు. మొదటగా మూడు సంవత్సరాల కాలానికి లైసెన్సు జారీ కోసం అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి సీ.ఎస్.ఎస్.ఎల్.ఆర్ కార్యాలయానికి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. లైసెన్సు సర్వేయర్ గా ఎంపికైన వారు నెలకు 30వేల రూపాయలకు పైగా ఆదాయంతో కూడిన ఉపాధి పొందవచ్చని అన్నారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17.05.2025 నాటికి ఓ.సీ, బీ.సీ లు అయితే 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఇంటర్మీడియట్లో గణితం సబ్జెక్టుతో కలిపి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, లేదా డ్రాఫ్ట్స్మన్ (సివిల్) ట్రేడ్లో ఎన్.సీ.వీ.టీ సర్టిఫికేట్ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ. లేదా తత్సమానం నిర్వహించిన ఎస్.ఎస్.సీ పరీక్షలో ఉత్తీర్ణత, లేదా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలని, లేదా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ సర్వేయర్ మరియు ఎస్టిమేటర్ కోసం ఇంటర్మీడియట్ (వృత్తి) కోర్సులో ఉత్తీర్ణత, లేదా భారతదేశంలోని సర్వేయర్ల సంస్థ నిర్వహించే ల్యాండ్ సర్వేయింగ్లో ఇంటర్మీడియట్ లేదా చివరి పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు, లేదా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే నాలుగు నెలల కాలానికి ల్యాండ్ సర్వేయింగ్లో సర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణత, లేదా కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ లేదా వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ టెక్నీషియన్లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత, లేదా ల్యాండ్ సర్వేయర్ సబ్జెక్టులో మూడు నెలల పాటు అభ్యర్థులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ సర్టిఫైడ్ కలిగి ఉన్న వారు లైసెన్స్ సర్వేయర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు శారీరక దృఢత్వం కలిగి ఉండి, సివిల్ సర్జన్ నుండి సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుందన్నారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం ఓ.సీ అభ్యర్థులు రూ. 10,000/-, బీ.సీలు రూ. 5,000/-, ఎస్సీ/ఎస్టీలు రూ. 2,500/- రుసుము చెల్లించాలన్నారు. శిక్షణ నిమిత్తం నమోదు కోసం మీ సేవా కేంద్రం నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారం కాపీ, టెన్త్, ఇంటర్మీడియట్ కాపీలు, ఐ టి ఐ (సివిల్), డిప్లొమా (సివిల్), బీ.టెక్ (సివిల్) వంటి మార్కుల మెమోతో పాటు నిర్దేశించిన విధంగా సాంకేతిక అర్హత సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. చిరునామా రుజువుగా ఆధార్ కార్డు కాపీ, బి.సి, ఎస్.సి, ఎస్టీ అభ్యర్థులు తహశీల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. లైసెన్సు సర్వేయర్ కోసం ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ లోపు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.