హైదరాబాద్, బతుకమ్మ: ఈనెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజు ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష నిర్వహించనుంది. దీంతో ప్రభుత్వం ఏపీపీ రాత పరీక్షను వాయిదా వేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తోంది. ఏపీపీ రాత పరీక్షలను జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ లో నిర్వహిస్తుండటంతో వేలాది మంది గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఈనెల 14న తలపెట్టిన ఏపీపీ రాత పరీక్షలను వాయిదా వేసేలా టీజీఎస్పీఆర్బీ కి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరారు. ఈమేరకు ’ఎక్స్‘ వేదిక గా తెలంగాణ సీఎంవోను ట్యా గ్ చేస్తూ.. పోస్ట్ పెట్టారు.