Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 8:39 pm Posted by : ramakrishna

శ్రీశైలంలో వైభవంగా వార్షిక కుంభోత్సవం

శ్రీశైలం, బతుకమ్మ : శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారికి వార్షిక కుంభోత్సవ సాత్వికబలి వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత అంకాలకమ్మకు మంగళవారం  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబాదేవికి నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమార్చన, పారాయణలు ఏకాంతంగా నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ సాంప్రదాయంగా రజకుడిచే శ్రీ చక్రం వద్ద స్థలశుద్ధి చేసి ముగ్గులు వేయించి పూజలు చేశారు. వందల కేజీల పసుపు కుంకుమలతో ఆలయ ఈవో దంపతులు అర్చక వేదపండితులచే శాంతి ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం సుమారు ఐదువేలకుపైగా గుమ్మడి కాయలతోపాటు ఐదువేల కొబ్బరికాయలు, లక్షకుపైగా నిమ్మకాయలతో, హరిహరరాయ గోపురం వద్ద కోటమ్మవారికి సైతం ప్రత్యేక పూజలు నిర్వహించి గుమ్మడి నిమ్మకాయలతో సాత్వికబలి నిర్వహించారు. ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ, శుక్రవారం కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి బలి గడియలు మంగళవారం రావడంతో ఏర్పాట్లు పూర్తిచేసి అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించారు.అమ్మవారి అంతరాలయంతో పాటు సింహమండపం వద్ద టన్నులకొద్ది వండిన అన్నం పెసరపప్పుతో కుంభరాశులు పోసి పిండి దీపాన్ని వెలిగించిన తరువాత మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజాభిషేకాలు, మహా మంగళహారతి, అనంతరం ఉత్సవ మూర్తులను వెండి పల్లకీపై ఉరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేశారు.

స్త్రీ వేషధారణలో అమ్మవారికి కుంభహారతి

స్వామివారి ఆలయ ప్రవేశ ద్వారంలో విధులు నిర్వహిస్తున్న వారితో సాంప్రదాయం ప్రకారం.. రాత్రి ఆరు గంటలకు స్త్రీ వేషంలో అమ్మవారి ఆలయానికి చేరుకోగా ప్రధాన అర్చకులు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి కుంభ హారతి ఇచ్చారు. సాయంకాల ప్రత్యేక పూజల అనంతరం పిండి వంటలతో అమ్మవారికి మహా నివేదన చేశారు. కుంభోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో రమణమ్మ, ఏఈవో హరిదాస్‌, పీఆర్‌వో శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్‌కుమార్‌, భద్రతా అధికారి అయ్యన్న, అధికారులు సిబ్బంది ఉన్నారు.

 

Annual Kumbh Mela celebrated in Srisailam

Annual Kumbh Mela celebrated in Srisailam