Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 7:06 pm Posted by : ramakrishna

పశు సంవర్ధక శాఖ సేవలను మెరుగుపర్చాలి

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటూ పశు సంవర్ధక శాఖ సేవలను మరింతగా మెరుగుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్సు హాల్ లో బుధవారం ఆయన పశు సంవర్ధక శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పశు సంపద కలిగిన రైతులకు అవసరమైన సేవలు అందించేలా పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెటర్నరీ డాక్టర్లు లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా సర్దుబాటు చేయాలని, మూగ జీవాలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. పశు సంపదను పెంపొందించేలా, తద్వారా ఆర్ధిక ప్రయోజనాలు పొందేలా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆయా సీజన్లలో పశువులకు సోకే వ్యాధులను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి పశు పోషకులకు అవసరమైన సూచనలు చేయాలని తెలిపారు. మూగ జీవాలకు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్, వైద్య సేవలు అందేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. గ్రామాలలో పశు వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు, సంచార పశు వైద్య వాహనం 1962 ద్వారా రైతుల వద్దకే వెళ్లి పశువులకు అవసరమైన చికిత్సలు అందేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ రోహిత్ రెడ్డి, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు.

Animal Husbandry Department services should be improved.