Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:19 pm Posted by : ramakrishna

జీవన భృతికి దరఖాస్తు అవకాశం కల్పించాలి

 

. . . టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేయూత పింఛన్లలో బీడీ కార్మికులకు జీవన భృతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. ఈ విషయాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా భవన్, రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేయూత పింఛన్లలో బీడీ కార్మికులకు జీవన భృతి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నామని తెలిపారు. వెంటనే చేయూత పథకంలో బీడీ కార్మికులు జీవన భృతి కోసం దరఖాస్తు చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరేందర్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే. సూర్యం, ఎస్.ఎల్. పద్మ, రాష్ట్ర నాయకులు డి. రాజేశ్వర్, ఎం. సుధాకర్, దేవదానం, వెంకన్న, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.