Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2024, 4:37 pm Posted by : ramakrishna

దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి

  • కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి డిమాండ్
  • అమిత్ షాను కేంద్రమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి లేఖ

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ: పార్లమెంటులో అంబేద్కర్ ని అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కేంద్రమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ, పిసిసి ఆదేశాల మేరకు ఇటీవల పార్లమెంటులో అంబేద్కర్ ని అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలకు నిరసనగా క్షమాపణ చెప్పాలని, కేంద్రమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు జిల్లా కాంగ్రెస్ అధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్, నుడా చైర్మన్ కేశవేణు లతో కలిసి మంగళవారం వినతి మెమోరండం అందచేశారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 10 సంవత్సరాలుగా పాలిస్తున్న బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్  ఆనవాళ్లను తుడిపి వేయాలనే ఆలోచన చేస్తుందని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. పార్లమెంటులో అమిత్ షా మాట్లాడుతూ మాటిమాటికి అంబేద్కర్ అనడం కంటే దేవుని ప్రార్థిస్తే మంచిదని చెప్పడం ఏదైతే ఉందో దానిని దేశ ప్రజలందరూ ఖండిస్తున్నారని,  దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్  ఆనవాళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్న బిజెపికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని, అదేవిధంగా పార్లమెంటులో ప్రధాని ముందే హోం మంత్రి అలా మాట్లాడితే మోడీ స్పందించకపోవడం చూస్తుంటే దీని వెనుక మోడీ కూడా ఉన్నారని భావిస్తున్నామని, కావున వెంటనే అంబేద్కర్ గురించి తక్కువ చేసి మాట్లాడిన హోం మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, అమీత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Amit Shah should apologize to the people of the country