Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 6:23 pm Posted by : ramakrishna

బిచ్కుందకు చేరుకున్న అమర్నాథ్ యాత్రికులు

బతుకమ్మ, బిచ్కుంద :  అమర్నాథ్ యాత్ర వెళ్లిన బిచ్కుంద యాత్రికులు నారం సాయి, నగేష్ గురువారం ఇక్కడకు సురక్షితంగా చేరుకున్నారు. యాత్రికులకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పట్టణ ప్రవేశ మార్గంలో ఎదురేగి స్వాగతం పలికారు. అవరోధాలను అధిగమించి అమర్నాథ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చిన యాత్రికులకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకగా బంధుమిత్రులు పూల వర్షం  కురిపించారు. స్థానిక  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్రికులకు స్వాగత సత్కార కార్యక్రమాలు నిర్వహించారు. జమ్ము-శ్రీనగర్ హైవే మార్గంలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటం తో వీరు చేపట్టిన అమర్నాథ్ యాత్ర ప్రమాదకరంగా మారింది. రహదారులు మూసి వేయడంతో వీరంతా మార్గమధ్యలో చిక్కుకుపోయారు. అయితే సీఆర్పీఎఫ్ జవాన్లు వీరిని సురక్షితంగా రక్షించి అక్కడి సమీప ప్రాంతంలోని  క్యాంపునకు తీసుకెళ్లి వసతి కల్పించారు. అక్కడ బస చేసిన యాత్రికులు పరిస్థితులు మెరుగవ్వగానే అమర్నాథ్ చేరుకొని దర్శనం చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు కొనసాగిన యాత్ర గురు గురువారం బిచ్కుందకు చేరుకోవడంతో ముగిసింది.