బీబీపేట్, బతుకమ్మ : బిబిపేట్ మండల కేంద్రంలోని తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం 2000 సంవత్సరంలో 10 వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 సంవత్సరాల క్రితం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాశీనాథ్ శర్మ, మాధవరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, విజయ్ కుమార్, సుతారి అంజయ్య, తుమ్మ రామచంద్రం, ఎదుల్ల ఇంద్రసేనారెడ్డి, కిష్టరెడ్డి, ఆనందరావు, విశ్వమోహన్, ఎల్లము, రమేష్ శర్మ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే ఉపాధ్యాయులకు ఎనలేని ఆనందం కలుగుతుందని,కష్టాలకు కృంగిపోకూడదని జీవిత లక్ష్యాన్ని చేరుకునేంతవరకు విశ్రమించకూడదని పూర్వ విద్యార్థులకు సూచించారు. సమాజ శ్రేయస్సుకు సాధ్యమైనంత వరకు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులు వారు 25 సంవత్సరాల క్రితం పాఠశాలలో పొందిన అనుభవాలను పంచుకుని ఆనందంతో గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.