నందిపేట, బతుకమ్మ: నందిపేట జడ్పీ హైస్కూల్కు పూర్వ విద్యార్థులు సరోజ – ఉల్లి సుధాకర్ గౌడ్ దంపతులు లక్ష రూపాయల విలువైన డిజిటల్ గ్రీన్ బోర్డులు, సౌండ్ సిస్టమ్ను శనివారం విరాళంగా అందించారు. ఈ బోర్డులు ఏడు తరగతులకు ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ఉల్లి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, ‘‘ఈ పాఠశాలే నాకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్పింది. అందువల్లే జీవనంలో ఉన్నత స్థాయికి ఎదిగాను. ఎన్నో దేశాలు చూసినా, ఎంత ఎదిగినా చిన్ననాటి ఊరు, బడి జ్ఞాపకాలే వెంటాడుతాయి. అందుకే ఈ చిన్న కానుక ద్వారా నా బడికి సేవ చేయడం సంతోషంగా ఉంది,’’ అని అన్నారు. ఎల్లప్పుడూ పాఠశాల అవసరాలకు సహకరించడానికి తాము సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
