. అధ్యక్ష పదవికి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే రాజీనామా
. ఎన్నికలయ్యే వరకు కొనసాగాలన్న రాష్ర్ట నాయకత్వం
నిజామాబాద్, బతుకమ్మ: టీఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లపాటు కొనసాగిన అలుక కిషన్ తన పదవికి రాజీనామా చేశారు. గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవోస్ లో ఉండొద్దనే నిబంధన మేరకు ఆయన తప్పుకున్నట్లు తెలిసింది. రాష్ర్ట నాయకత్వం సూచనల నేపథ్యంలోఈనెల రెండో వారంలో నిర్వహించిన రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో ఆయన తన రాజీనామాను సమర్పించారు. నూతన కార్యవర్గం ఏర్పాటయ్యే వరకు కొనసాగాలని రాష్ట్ర నాయకత్వం కిషన్ కు సూచించింది. టీజీవోలో కీలకపాత్ర పోషించేందుకే పదవీకాలం ఉన్నప్పటికీ అలుక కిషన్ టీఎన్జీవోస్ కు రాజీనామాచా చేసినట్లు చర్చ జరుగుతోంది.
నూతన అధ్యక్షుడు ఎవరు?
అలుక కిషన్ టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నూతన అధ్యక్షుడు ఎవరనేదినిపై చర్చ మొదలైంది. త్వరలోనే ఎన్నిక నిర్వహించాలని రాష్ర్ట నాయకత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పోటీలో నిలిచే వారి సంఖ్య పెద్దగానే ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట గౌరవ అధ్యక్షులతోపాటు టీఎన్జీవోలో కీలకంగా ఉన్న మరో ఇద్దరు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రాష్ర్ట ఉపాధ్యక్షుడు కూడా టీఎన్జీవో పదవిపై కన్నేసినట్లు తెలిసింది. టీఎన్జీవో తాలుకా ఎన్నికలను అక్టోబర్ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాలుకా ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే జిల్లా కమిటీ ఎన్నికలకు వెళ్లనున్నారు.
సామాజిక సమీకరణలు కీలకం
టీఎన్జీవో ఎన్నికల్లో సామాజిక సమీకరణలు కీలకం కానున్నాయి. గతంలో పదవులను ఆశించి భంగపడినవారు, ఇతర యూనియన్ లలో చేరిన నాయకులు అలుక కిషన్ రాజీనామాతో ఎలాగైనా పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతర్గతంగా ఇది వరకే కిషన్ రాజీనామా విషయం తెలిసినప్పటికీ సైలెన్స్ గా ఉన్నా నాయకులు పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికపరంగా ఉద్యోగులుగా కీలకస్థానాల్లో ఉన్న వారు పావులు కదుపుతున్నారు. టీఎన్జీవోలో తాలుకాతోపాటు జిల్లా కార్యవర్గంలో ఉన్నవారే అందులో కీలకంగా వ్యవహరిస్తుండడం విశేషం. చాలా రోజులుగా టీఎన్జీవో అధ్యక్ష పదవి జిల్లా కేంద్రానికే పరిమితమైందని రూరల్ వారికి అవకాశం ఉంటుందా? లేదా? అన్న చర్చజరుగుతోంది. ఉమ్మడి జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ పదవి కూడా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడికే ఉండడంతో రెండు జిల్లాల్లో దీనిపై చర్చ జోరందుకుంది.