Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 5:07 pm Posted by : ramakrishna

రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న వారందరిని గౌరవించాలి

 

. . . కమిటీ చైర్మన్ డా.కె.కేశవ రావు

 

హైదరబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారందరిని గుర్తించి ప్రభుత్వం సముచితంగా గౌరవించాలని ప్రభుత్వ లక్ష్యమని కమిటీ చైర్మన్ డా. కె. కేశవరావు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఛైర్మన్‌ డా. కె. కేశవరావు అధ్యక్షతన సమావేశం అయ్యింది. కమిటీ సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి లు సంబంధిత ఉన్నతాధికారులతో జరిపిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన జి.వో.ఆర్టీ.నెం.679 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల  మేరకు కమిటీ సచివాలయంలో మొదటి సారి నేడు సమావేశమైంది. జూన్ 4 న అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశ లలో క్షేత్రస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి పారదర్శకంగా  అర్హుల జాబితా తయారీకి తగు కార్యాచరణ రూపొందించాలని అధికారులను కమిటీ ఆదేశించింది. ఉద్యమకారుల గుర్తింపు ప్రమాణాలు, జైలు శిక్షలు అనుభవించిన వారు, పలు పోలీస్ కేసుల నమోదు, ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగులు, జర్నలిస్టులు, అడ్వకేట్ లు, విద్యార్థులు, ఆర్.టి.సి కార్మికులు, సింగరేణి కార్మికులు, వారందరిని గుర్తించి, సముచితంగా గౌరవించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, అలాగే వారి సేవలు, త్యాగాలకు తగిన గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష కృషి చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం తరఫున తగిన గౌరవం, గుర్తింపు అందేలా సిఫార్సులు చేయాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని, సమాచార సేకరణలో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఉద్యమంలో పాల్గొన్న వారందరిని గుర్తించి సముచితంగా గౌరవించాలని ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హోం శాఖ ముఖ్యకార్యదర్శి శిఖా గోయల్, జి.ఎ.డి కార్యదర్శి రఘునందన్ రావు, జి.ఎ.డి ప్రోటోకాల్ డైరెక్టర్ హరీష్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహా రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి పాపి రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.