. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఈ నెల 21 న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నామని, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కోరారు. ఇందూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ రోజు, రేపు మండల స్థాయిలో ఎమ్మార్వో కార్యాలయాలకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. అలాగే జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత హామీలపై ప్రజల తరఫున ప్రశ్నిస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నిలబెట్టడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఇప్పటివరకు ఒక్క ఇంటిని కూడా ప్రజలకు అందించలేకపోయిందని తెలిపారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ, మొక్కజొన్న పంటలకు సరైన ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మార్కెట్లో ధర 1500–1600 మధ్య ఉండటం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని ప్రశ్నించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ రైతు రుణమాఫీ హామీ అమలు కాలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో విఫలమయ్యారని, పింఛన్ల పెంపు, సామాజిక భద్రత పథకాలు నిలిచిపోయాయని, విద్య, వైద్య రంగాల్లో సరైన సదుపాయాలు కల్పించలేకపోయారని, మహిళల భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధరల పెరుగుదల నియంత్రణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని తీవ్రంగా విమర్శించారు. జిల్లాలో ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే లు కార్పొరేషన్ చైర్మన్ లకు ప్రజల మీద పట్టింపు లేదన్నారు. ఈ అన్ని సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, జిల్లా ఉపాధ్యాక్షులు ప్రమోద్ కుమార్, బంటు రాము, నిమ్మల శ్రీనివాస్, బాన్స్ వాడ ఇంచార్జి కోనేరు శశాంక్, రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, జిల్లా కార్యదర్శిలు దాంపల్లి జ్యోతి, పోల్కం వేణు, పాలేపు రాజు, బద్దం కిషన్, పుట్ట వీరేందర్, జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.