ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్, బతుకమ్మ : మహిళలను చైతన్యం చేయడంలో అహల్య బాయ్ చేసిన సేవలు మరువలేనివని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS ) ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అహల్యబాయ్ హోల్కర్ త్రి శతాబ్ది జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీ విధించి, నిర్భంధించిన ఇందిరాగాంధీ చరిత్ర కాకుండా అహల్య బాయ్, ఝాన్సీ లక్ష్మిబాయ్, రాణి రుద్రమ్మ, జిజియా బాయ్ లాంటి వీర వనితల చరిత్రను మహిళా సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వందలాది దేవాలయాలు, ధర్మశాలలను నిర్మించి 1780లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు అహల్య బాయ్ కృషి చేశారన్నారు. హిందువులు సంఘటితమై జరుగతున్న దాడులను ప్రతిఘటించాలన్నారు. కాశ్మీర్ పహల్ గామ్ లో ఉగ్రవాదులు చేసిన మరణ కాండ కలిచివేసిందన్నారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు హనుమంతరావు, ప్రధానకార్యదర్శి సురేష్, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, డీఈవో అశోక్, ముఖ్య వక్త కల్పన, ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్,రాజ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
