Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 4:19 pm Posted by : ramakrishna

ఆగనిఫైనాన్స్ అక్రమ దందా

బతుకమ్మ, బిచ్కుంద :  పేదప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని డైలీ ఫైనాన్స్, చిట్టీలు అంటూ జోరుగా దందా కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఇదంతా బహిరంగగానే జరుపుతూ అధికవడ్డీ వసూలు చేస్తూ అమాయకులను రోడ్డున పడేస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపించడం షరా మాములైంది. బిచ్కుంద పట్టణంతో పాటు పలు గ్రామాల్లో సైతం అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. ఈ దందాలో కూరుకుపోయేది మధ్యతరగతి, చిరు వ్యాపారులనే టార్గెట్ చేస్తూ డైలీ, విక్లీ అంటూ అధిక వడ్డీకి డబ్బులు ఇస్తూ వసూలు చేస్తూ అధిక వడ్డీని వసూలు చేస్తున్నారు కొందరు. అమాయకపు ప్రజలు తమ వ్యాపారాల కోసం ఫైనాన్స్ లో నుండి అప్పులు తీసుకొని చిక్కుల్లో పడుతూ సతమతమవుతున్నారు. డైలీ, వీక్లీ ఫైనాన్స్ ల పేరిట ఐదు నుంచి పదిశాతం వడ్డీని వసూలు చేస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ వ్యాపారాలు కొనసాగుతున్నప్పటికీ అక్రమ డైలీ ఫైనాన్స్, చిట్టీ వ్యాపారుల పై అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారంలో అమాయకులను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ లు నడిపేవారి ఆగడాలను తట్టుకోలేక చిరువ్యాపారులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు కూడా నెలకొంది. లోకల్ ఫైనాన్సులే కాకుండా బిచ్కుంద పట్టణంలోనుండి కూడా కొందరు అక్రమవ్యాపారులు వడ్డీ దుకాణాలు తెరిచి బహిరంగంగానే వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న ఘటనలు కోకోల్లలుగా ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత బహిరంగంగా అధిక వడ్డీతో డైలీ ఫైనాన్స్ చిట్టివ్యాపారాలు నడుపుతూ అమాయకులను దోచుకుంటున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.